తెలంగాణలో లాక్డౌన్ మే 28 వరకు పొడిగించే అవకాశం….!
1 min readతెలంగాణలో లాక్డౌన్ మే 28 వరకు పొడిగించే అవకాశం….!
కేంద్రం లాక్డౌన్ని కొన్ని సడలింపులతో మే 17వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో మాత్రం మే 7 వరకు ఏ సడలింపులు లేవని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇంకా రెండు రోజుల్లో రాష్ట్రంలో సడలింపులు లేని లాక్డౌన్ ముగుస్తుండటంతో ప్రభుత్వం దీనిపై సంబంధిత అధికారులతో సమావేశమై 7వ తేదీ తరువాత తీసుకోవల్సిన చర్యల గురించి చర్చినచనున్నట్టు తెలుస్తోంది.
ఈ సమావేశంలో ముఖ్యంగా లాక్డౌన్ పొడిగింపు మరియు కేంద్రం ఇచ్చిన సడలింపులపై చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రంలో రెడ్ జోన్లలో ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, జిల్లాల్లో కేసులు పెరుగుతుండటంతో, ఈ ప్రాంతాల్లో కఠిన చర్యలు తప్పవని అధికారులు సూచిస్తున్నారు.
కేంద్రం ఇచ్చిన సడలింపుల్లో ప్రదానంగా చెప్పుకోవల్సింది మద్యం విక్రయాలు. ఎందుకంటే ప్రతీ రాష్ట్రంలో అధిక ఆదాయం ఈ మద్యం అమ్మకాలపై ఉంటుంది. లాక్డౌన్ కారణంగా మద్యం అమ్మాకాలు నిలిపివేయడం వల్ల ఆయా రాష్ట్రాల ఆదాయానికి భారీగా గండి పడింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం కొన్ని షరతులతో మద్యం అమ్ముకోవచ్చని అనుమతిచ్చిది.
మద్యం అమ్మాకాలు మొదలు పెట్టడంతో మందు బాబులు ఒక్కసారిగా మద్యం షాపుల ముందు ప్రత్యక్షమయ్యారు. కొన్ని మద్యం షాపుల ముందు ఎండలో 2 కిలో మీటర్ల వరకు బారులు తీరారు. ఇప్పుడు మందు బాబులను కట్టడి చేయడం పోలిసులకు తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు.
మద్యం అమ్మకాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. మే 7 తో సడలింపులు లేని లాక్డౌన్ ముగుస్తుండటంతో ఈరోజు జరిగే క్యాబినెట్ సమావేశంలో దీని గురించి కూడా చర్చించనున్నారు. ఈ విషయంలో సీయం కేసీఆర్ పలువురి సలహాలను తీసుకున్నట్టు తెలుస్తోంది. చాలావరకు మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వకుంటేనే బాగుంటుందని అభిప్రాయ పడినట్లు సమాచారం.
మద్యం విక్రయాలు మొదలు పెడితే మందుకోసం జనాలు ఒకేసారి బయటకు రావడం జరుగుతుంది. ఒకేసారి జనాలు గుంపులుగా రావడం, కిలోమీటర్ల వరకు బారులు తీరడం వల్ల పోలీసులకు వారిని అరికట్టడం ఇబ్బందికరంగా మారే అవకాశముంది. కేంద్ర ప్రభుత్వ సూచనలమేరకు గ్రీన్, ఆరెంజ్ జోన్లలో అనుమతినిస్తే, ఇలా జనం ఒక్కసారిగా బయటికి రావడం వల్ల మళ్ళీ కరోనా కేసులు పెరిగే అవకాశం ఉండొచ్చు.
అయితే కొన్ని చోట్ల కేసులు పెరుగుతున్న కారణంగా, లాక్డౌన్ని కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మద్యం విక్రయాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవచ్చు.
వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మే 28 వరకు లాక్డౌన్ని పొడిగించే అవకాశం ఉంది.
ఈరోజు సీ.యం కేసీఆర్ లాక్డౌన్ గురించి ఏ విధమైన ప్రకటన చేయబోతున్నారో అని తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

