తెలంగాణలో పెరుగుతున్న మిస్సింగ్ కేసులు- Missing cases increases in Telangana
1 min read
Missing Cases In Telangana
ఇటీవల కాలంలో పెరుగుతున్న మిస్సింగ్ , కిడ్నాపింగ్ కేసుల దృష్ట్యా శుక్రవారం సైబరాబాద్ కమీషనరేట్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మిస్సింగ్ కేసులు వ్యవస్థీకృత నేరాలు కావు, అవి కేవలం వ్యక్తిగత కేసులు మాత్రమేనని, సైబరాబాద్ సిపి విసి సజ్జనార్ అన్నారు. మిస్సింగ్ కేసులను నివారించడానికి పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని, ప్రజలు భయాందోళన చెందవద్దని అభయమిచ్చారు.
మిస్సింగ్ కేసులకు సంబంధించి కుటుంబ సభ్యులు , మిస్సింగ్ అయిన వ్యక్తులు, పిల్లల తాలూక బంధువులెవరైనా సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టయితే వారికి తగిన న్యాయం చేస్తామని సిపి చెప్పారు.
అదృశ్యం వెనుక కారణాలు.. ఇటీవల కాలంలో మిస్సింగ్ కేసుల వార్తలను తరచుగా వింటున్నాం . తెలిసి తెలియని వయసులో చిన్నారులు ఇంటి నుంచి తప్పిపోవడం, ప్రేమ పేరుతో టీనేజర్లు, వివాహేతర సంబంధాలు, కుటుంబ కలహాలు, అప్పులు, ఆత్మహత్య చేసుకోవటం, ఇతరత్రా కారణాల నేపథ్యంలో అదృశ్యమవుతున్నారు. అదేవిధంగా పరీక్ష ఫలితాల వెల్లడి సమయంలోను ఎక్కువగా విద్యార్థుల మిస్సింగ్ కేసులు నమోదవుతుంటాయని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి సందర్భాలలో వెళ్లిన పిల్లల్లో ఒక రిద్దరు మినహా మిగతా వారంతా ఇండ్లకు తిరిగి వచ్చే స్తుంటారన్నార. పరీక్షల సమయంలో లవ్ ఎఫైర్స్ ఉన్న కొంత మంది యువత సైతం ఇంటి గడప దాటుతున్నా రని తెలిపారు.
వీటితోపాటు తల్లిదండ్రులతో తరచూ తగువులాడినా పిల్లలు, ఇంటినుంచి వెళ్లిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, మరి కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల మీద అలిగి వెళ్లిపోతుంటారన్నారు. పరీక్షల్లో మార్కులు రాలేదనే కారణంతో చిన్నారులు మాయమవుతుంటే.. ఆర్థిక ఇబ్బందులతో మధ్య వయస్కులు ఇళ్ల నుంచి వెళ్లిపోతున్నారు.
అమ్మాయిల విషయానికిస్తే మోసగాళ్ల ప్రేమలో పడి పారిపోవటం, ఇష్టంలేని పెళ్లి, కుటుంబంలో ప్రతికూల వాతావరణం వంటి పలు కారణాలు అధికంగా కనిపిస్తున్నాయని తెలిపారు. అదేవిధంగా మహిళల విషయాని కొస్తే అత్తింట్లో సరైన ఆదరణ లేకపోవడం, హింసను భరించలేక వెళ్లిపోతున్నారని తెలిపారు. మరికొందరు వివాహేతర సంబంధాలు , కుటుంబ కలహాలు , అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవటం, ఇతరత్రా కారణాల నేపథ్యంలో అదృశ్యమవుతున్నారు. వృద్ధుల విషయం లోకి వస్తే అదృశ్యానికి పిల్లలు తమను సరిగా చూడటం లేదనేదే ప్రధాన కారణంగా కనిపిస్తోందని, కొంతమంది మతిస్థిమితం సరిగా లేకపోవడం వల్ల అదృశ్యం అవుతున్నారని చెప్పారు. విద్యార్థుల విషయంలో చదువు పట్ల భయం, తప్పుచేసి పెద్దల భయానికి పారిపోవటం, చెడు స్నేహం, దురలవాట్ల కారణంగా ఇటీవలి కాలంలో అదృశ్యమవుతున్న కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని స్పష్టం చేశారు. సోషల్ మీడియా కారణంగా అబ్బాయిలు , అమ్మాయిల మధ్య ఆకర్షణ పెరిగిందని, వీటి ద్వారా అదుపు లేకుండా మాట్లాడుకోవడం, ఇంటి నుంచి పారిపోయేందుకు ప్రేరేపించే అంశంగా మారుతోంది అని సీపీ అన్నారు. ఎవరూ బయపడ వద్దని ఆయన అన్నారు.
