ప్రజల ఉసురు తగులుతుంది, మంత్రి తలసాని హాట్ కామెంట్స్… ఎన్నికల తరువాత కూడా వరద సాయం.
1 min read
Telangana State Minister Talasani Srinivasa Yaadav
హైదరాబాద్ వరదలపై పక్క రాష్ట్రాలు సాయం చేయడానికి ముందుకు వచ్చినా కేంద్రం రూపాయి కూడా ఇవ్వలేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. బుధవారం ఆయన ఆదర్శ నగర్ ఎంఎల్ఏ క్వార్టర్స్ లో విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్షాలకు పేదల ఉసురు తగులుతుందని శాపనర్థాలు పెట్టారు. ఇక ప్రజలు ఇబ్బందులు పడకూ డదన్న ఉద్దేశంతో దేశ చరిత్రలో ఎన్నడూలేని విధంగా తమ ప్రభుత్వం 4,75,781 మందికి నేరుగా వరదసాయం అందజేసిందన్నారు. అనంతరం మీసేవా ద్వారా నమోదు చేసుకోవాలని సూచించామన్నారు. గత మూడు రోజుల్లో రూ.165 కోట్లు మీసేవ ద్వారా వరద బాధితులకు పంపిణి చేసినట్లు ఆయన చెప్పారు. జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో ఈ.సి వరదసాయం నిలిపివేసినా, ఫలితాల అనంతరం ఈ మొత్తాన్ని ప్రజలకు అందించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ భావిస్తున్నట్లు తెలిపారు .
ప్రజలు ఆలోచించాలి … ప్రతిపక్షాలు టిఆర్ఎస్ ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాయని తలసాని అన్నారు. వ్యక్తిగతంగా కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్నారని, ప్రజల మధ్య వైషమ్యాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు వెళ్తే ప్రజలే తేల్చుతారని, స్వాతంత్రం వచ్చాక ఇక్కడ ఎన్నడూ జరగని అభివృద్ధి టిఆర్ఎస్ హయాంలోనే జరిగిందన్నారు. వందల కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.
తెలంగాణ వచ్చాక ప్రభుత్వం ఏమి చేసిందో హైదరాబాద్ ప్రజలు ఆలోచించాలన్నారు. దేశంలోని ప్రతీ ఒక్కరూ నగరం వైపు చూస్తున్నారన్నారు. ఆధునాతన రోడ్లు, సిసి కెమెరాలు, ఎల్ఈడిలు, బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశామని వివరించారు. భారతదేశంలో తమ ప్రభుత్వం కట్టిన ఇళ్లు ఎవరూ కట్టలేదన్నారుకట్టించలేదన్నారు. ఇక దుబ్బాక ఎన్నికల్లో బిజెపి విజయం సాధించిన మాత్రాన మొత్తం అదే ప్రపంచం అనుకుంటే ఎలా అంటూ చురకలు అంటించారు . ఎవరు ఎన్నిరకాలుగా అడ్డుపడినా, ఎన్నికల తర్వాత ప్రజలకు వరద సాయం అందిస్తామన్నారు. మా కుటుంబం నుంచి ఎవ్వరు పోటీ చేయడంలేదు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో తమ ఇంటి నుంచి ఎవరూ పోటీ చేయడం లేదని మంత్రి శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. వాస్తవానికి ప్రజా స్వామ్యంలో పోటీ చేసే హక్కు అందరికి ఉంటుందన్నారు. మేయర్ అభ్యర్థిపై తమకు ఆశలు లేవన్నారు.
మరి ఈ వరద సాయం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో టిఆరెఎస్ విజయానికి ఎంతలా దోహదపడుతుందో తెలియాలంటే వచ్చే నెల 4 వ తేదీ వరకు ఆగాల్సిందే.
