ధనుర్మాసం- విశిష్టత
1 min read
ధనుర్మాసం- విశిష్టత
ముఖ్యంగా ధనుర్మాసం అనగా మకర రాశి నుండి సూర్యుడు ధనురాశి లోకి ప్రవేశించి మరల మకర రాశి లోకి వచ్చే ముప్పై రోజులను ధనుర్మాసం అని అంటారు. ఈ మాసం అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరం. ఈ మాసంలో భక్తులు శ్రీ మహా విష్ణువు ని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.
అలాగే శ్రీ మహా విష్ణువు భక్తురాలైన గోదాదేవి, ఈ మాసం ధనుర్మాస వ్రతం జరుపుకొని విష్ణుమూర్తి అనుగ్రహం పొందింది. అందుచేత ఈ నెల రోజులు విష్ణు భక్తులంతా భక్తి శ్రద్ధలతో శ్రీ విష్ణువును పూజించుకుంటారు.
ఈ ధనుర్మాసము నందు శ్రీ మహా విష్ణువు ప్రీతి కొరకు చేసే పూజలు అక్షయ ఫలితాలను కలిగిస్తాయని పెద్దలు చెబుతారు. సూర్యోదయానికి ముందే శ్రీ మహావిష్ణువును తులసి తో పూజించి, బియ్యం,పెసర పప్పు తో వండిన పొంగలి ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా చేస్తే సకల దోషాలు పోతాయి అని ప్రతీతి.
భగవంతుడు పొగమంచు వెలుగులో కనిపించినట్లుగా ఉంటుంది. ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలకు పగలు, దక్షిణాయనం వారికి చీకటి అని అంటారు పెద్దలు. అందుకే గోదాదేవి వేకువ జామున బ్రహ్మ ముహూర్తమునందు స్వామికి చక్కని రాగమాలికల లాగా స్వామి వారి లీలలను ముప్పది (30) పాటలుగా చెప్పినది.
తిరు అనగా మంచి అని అర్ధం, పావై అంటే పాట అని అర్ధం. అంటే మంచిని అందించే భగవంతుని పాటలు తిరుప్పావై. ఈ 30 పాశురములలో అనేక వేదాంత, ఉపనిషద్ ల సారాంశం దాగివుంది. దాన్ని గోదాదేవి అందరికీ అర్ధమయ్యేలా తన మాత్రుభాష తమిళం లో గానం చేసి లోకానికి అందించారు.
ఏ దేవతనైనా, దేవుడినైనా విశ్వాసం తో పూజించమని మన భారతదేశ సనాతన సంప్రదాయం. గీతా కారుడు చెప్పినట్టు యత్ భావం తత్ భవతి, ఎవరు నన్ను నమ్ముకొని ఎలా పూజించినా వాళ్ళని కరుణించే వాడే భగవంతుడు. అందుకే మనవారు సర్వేజనా సుఖినో భవంతు అంటారు. అందుకే ఆండాళ్ ధరించిన పూమాలని సైతం స్వామి కరుణా భావంతో స్వీకరించారు. కోదై అనగా పూమాల అని అర్ధం.
ఆవిధంగా గోదాదేవి రంగనాథున్ని సేవించి, తరించి, లోకాన్ని తరింపజేసింది. ఆచంద్ర తార్కరం లోకానికి రంగనాథుని కరుణ తన తిరుప్పావై ద్వారా ఇంకా ఇంకా అందిస్తుంది.
