పార్లమెంట్ లో గందరగోళం….
1 min read
Lskb
బడ్జెట్ సమావేశాల మొదటి రోజైన శుక్రవారం నాడు కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వివిధ ప్రతిపక్ష పార్టీలు లోకసభను నినాదాలతో హోరెత్తించాయి . కేంద్ర మంత్రి సురేశ్ అంగడి, జస్వంత్ సింగ్, తరుణ్ గొగోయి, మోతీలాల్ వోరా, అహ్మద్ పటేల్, రామ్ విలాస్ పాసవాతోపాటు 26 మంది మాజీ సభ్యులకు సభ నివాళులు అర్పించిన వెంటనే కాంగ్రెస్, డిఎంకె , వామపక్షాల సభ్యులు సభ వెల్ లోకి ప్రవేశించి రైతు చట్టాల విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వడం మొదలుపెట్టారు. శివసేన సభ్యులు మాత్రం తమ స్థానాల్లో కూర్చునే నినాదాలు ఇచ్చారు.
ఆమోదం పొందినప్పటి నుంచీ విపక్షాలు కొత్త సాగు చట్టా లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. గత సమావేశాల్లోనే విపక్షాలు వ్యవ సాయ చట్టాల ఆమోదాన్ని వ్యతిరేకించాయి. అయితే పార్లమెంటులో మెజారిటీ ఉండటంతో కేంద్ర ప్రభుత్వం తగిన చర్చ లేకుండానే మూడు చట్టాలను ఆమోదించింది. దాంతో వేలాది మంది రైతులు కొత్త చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన బాటపట్టారు . ఇవి కనీస మద్దతు ధరకు, మండీ వ్యవస్థకు గండి కొడతాయని, తమను బడా కార్పొ రేట్ల దయా దాక్షిణ్యాలకు వదిలేస్తాయని అనుమా నాలను వ్యక్తంచేశారు . అందుకని చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు . రెండు నెలలకు పైగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన కొనసాగిస్తున్నారు. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ సహా విపక్షాలు చట్టాల రద్దుకు రైతుల ఆందోళనకు సంఘీభావం ప్రకటించాయి. ఈ క్రమంలో బడ్జెట్ సమావేశాల్లో కూడా విపక్షాలు తమ వాదనకు కట్టుబడి , చర్చలను అడ్డుకొనే అవకాశం ఉంది. రైతులు, విపక్షాలు, రాష్ట్రాలతో చర్చించిన తర్వాత కొత్త వ్యవసాయ చట్టాలు చేసేందుకు పట్టుపట్టవచ్చ. ఇక చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలో పాల్గొని మరణించిన రైతులకు శ్రద్ధాంజలి ఘటించాల్సిందేనని కూడా ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అంతేకాకుండా 20 కిపైగా విపక్షాలు మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా పార్లమెంటు సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాయి. ఇక స్పీకర్ వేదిక సమీపంలోని వెల్లో సహచరులు నినాదాలు ఇస్తున్న సమయంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సభలోనే ఉన్నారు. ఆందోళనకు దిగిన సభ్యులకు ఎవరి స్థానాలకు వారు వెళ్లాల్సిందిగా , భౌతికదూరంతో సహా కొవిడ్ నియమాలు పాటించాలని స్పీకర్ ఓం బిర్లా విజ్ఞప్తి చేశారు.
సభ సమావేశమైన అనంతరం జెడి ( యు ) కు చెందిన సునీల్ కుమార్ లోకసభ సభ్యుడుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన గతేడాది జరిగిన ఉప ఎన్నికలో వాల్మీకినగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు.
