రైతులకు మద్దతుగా నిలిచిన హాలీవుడ్ స్టార్స్
1 min read
Hollywood Stars Supports Indian Farmers
ఉద్యమానికి సెలబ్రిటీల బాసట… రైతులకు మద్దతు పలికిన పలువురు అంతర్జాతీయ ప్రముఖులు
కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని మానుకొని , కొత్తగా తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్ తో రెండు నెలలకు పైబడి ఆందోళన కొనసాగిస్తున్న రైతులకు అంతర్జాతీయ సెలబ్రిటీలు బాసటగా నిలిచారు. ఈ మద్దతును జీర్ణించుకోలేకపోయిన కేంద్ర ప్రభుత్వం ఇది పూర్తిగా ఆంతరంగిక విషయమని, ఇందులో జోక్యం చేసుకోవ డం సరికాదని వ్యాఖ్యానించింది. అంతేగాక, బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదంటూ ట్విట్టర్ యాజమాన్యంపైన మండిపడింది .
ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాదిగా తరలివచ్చిన రైతులు నిరసనను కొనసాగిస్తుండగా, అక్కడ ఇంటర్నెట్ సేవలను అధికారులు నిలిపివేయడంపై పాప్ స్టార్ రిహానా చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ‘ రైతుల పోరాటం గురించి మనం ఎందుకు మాట్లాడుకోవడం లేదు ‘ అంటూ, పది కోట్లకుపైగా ఫాలోయరు కలిగి వున్న రిహానా ఈ ట్వీట్ చేసిన వెంటనే చాలా మంది స్పందించారు. గాయకులు జే సియాన్, డాక్టర్ జూయిస్, ప్రముఖ నటి మియా ఖలీఫా తదితరులు రైతు ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు. స్వీడన్కు చెందిన టీనేజ్ సంచలనం, పర్యావరణ పరిరక్షణ ఉద్యమకర్త గ్రెటా థన్బర్గ్ కూడా రైతు ఉద్యమానికి మద్దతు తెలిపింది. ‘ భారత్ లో రైతులు చేస్తున్న ఆందోళనకు మేము బాసటగా నిలుస్తాం ‘ అని ఆమె ట్వీట్ చేసింది. గత ఏడాది ఫిబ్రవరిలో పౌరసత్వ చట్ట సవరణ ( సిఎఎ ) కు వ్యతిరేకంగా హాలీవుడ్ స్టార్ జాన్ క్యూసక్ గళం కలిపాడు. అయితే , అప్పటితో పోలిస్తే , రైతుల ఉద్యమానికి అంతర్జాతీయ సెలబ్రిటీలు ఎక్కువగా స్పందించారు. ఉగాండాకు చెందిన పర్యావరణ కార్యకర్త వనీసా రైతుల డిమాండ్లను సత్వరమే పరిష్క రించాలని కోరారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సమీప బంధువు, ప్రముఖ న్యాయవాది మీనా హారిస్ భారత సర్కారుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ‘ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశంలో ప్రజా పోరాటాలు జరుగుతున్నాయి. రైతులు ఆందోళన చేస్తున్న ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం అత్యంత దారుణం . ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడిగా దీనిని పరిగణించాలి ‘ అని ట్వీట్ చేశారు. మొత్తం మీద పదుల సంఖ్యలో సెలబ్రిటీలు స్పందించి, రైతు ఉద్యమానికి సంఘీ భావం ప్రకటించడం ఒక నూతన ఒరవడికి శ్రీకారంగా భావించాలి .
